Wednesday, 7 March 2012

మహిళా నీకు వందనం

                                                           
నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రెండేళ్ళ కిందట నూరు వసంతాల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన మర్నాడు మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. మహిళాలోకానికి కొత్తగా సంక్రమించే మూడోవంతు రాజకీయ సాధికారిత కొత్త ఉత్సాహం నింపింది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న స్త్రీలకు చట్ట సభల్లో 33 . 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు చట్టం కావాలని నారీలోకం ఎదురు చూస్తోంది. 189 దేశాలకు సంబంధించి చట్టసభల్లో మహిళా సభ్యుల సంఖ్య పరిశీలించినప్పుడు భారత్ 108 వ  స్థానంలో ఉంది. అన్నింటికీ మించి దేశంలోని రాజకీయ పార్టీల స్థానాల్లో కనీసం 40  శాతం మహిళలకు కేటాయించే విధంగా చట్టం తేవాలన్న వాదన గట్టిగానే ఉంది. పురుషుల ధోరణిలోనూ ఎంతో మార్పు రావాలి. గృహహింస, దోపిడీ, అసమానతలకు ఇకనైనా తెరపడాలని ఆశిద్దాం. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు సంఘీభావం ప్రకటించే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ మహిళాలోకానికి మరోసారి శుభాకాంక్షలు.

Saturday, 3 March 2012

వరల్డ్ రికార్డ్ హీరో బీహార్ రైతు సుమంత్ వరి సాగు వివరాలు

                                                                
"శ్రీ" వరి సాగులో ప్రపంచ రికార్డు సృష్టించిన బీహార్ రైతుల గురించి గతంలో ఒక పోస్టు రాసిన సంగతి మీకు తెలుసు. మార్చి నెల "అన్నదాత" వ్యవసాయ పత్రికలో ఈ వ్యాసం ప్రచురితమైంది. అయితే ఈ వ్యాసంలో "శ్రీ" వరి సాగుకు సంబంధించి మరిన్ని సంగతులు వివరంగా ఇవ్వడం జరిగింది. ప్రపంచ రికార్డు సృష్టించిన సుమంత్ కుమార్ తో నేను మాట్లాడాను. అతను వాడిన విత్తనం, అనుసరించిన పద్దతులు తదితర వివరాలను  ఈ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. స్కాన్ చేసిన కాపీ ని ఇక్కడ జత చేస్తున్నాను.
                                                            

Friday, 2 March 2012

సిమ్లాలో రాణించిన తెలుగు రైతు

                                                                        
జనవరి 'అన్నదాత' మాసపత్రికలో యాపిల్ సాగులో రాణిస్తున్న తెలుగు రైతు పురుషోత్తమరావు గురించి ఒక వ్యాసం రాశాను. త్వరలో వీరు సిమ్లా నుంచి హైదరాబాద్ కు ఆర్గానిక్ యాపిల్స్ ను తీసుకువచ్చి విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యాసం చదివిన ఎందరో పురుషోత్తమరావు సెల్ నెంబర్ కావాలని నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇటీవల వారు ఇటలీ వెళ్లి రావడం వల్ల నేను ఇచ్చిన నెంబరు కలవకపోవడం జరిగింది. ప్రస్తుతం వారు హైదరాబాద్ లోనే ఉన్నారు. అలానే పలువురు ఈ వ్యాసం క్లిప్పింగ్ కావాలని కోరారు. వారి సౌకర్యార్ధం అన్నదాతలో ప్రచురితమైన వ్యాసం స్కానింగ్ కాపీని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.  వారి సెల్ నెంబర్-  09218534124 . 
                                                                 

Tuesday, 21 February 2012

వ్యవసాయం పట్టని ప్రభుత్వమిది!-జేపీ

                                                            

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ రైతాంగ సమస్యలపై  ప్రభుత్వ నిర్వాకాన్ని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కిలో కందిపప్పు ధర రూ. 100 అయినప్పుడు గగ్గోలు పెట్టిన నాయకులు నేడు రైతుకు కిలో కందిపప్పుకు కేవలం రూ. 30 ధర వస్తోంటే నోరుమెదపడంలేదని విమర్శించారు. ఉత్పత్తులకు తగిన ధర కల్పించలేని ఈ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల ప్రభుత్వంగా భావించాలా  అని ప్రశ్నించారు. తన చేతకాని విధానాలతో రైతుల పరిస్థితిని దిగజార్చిన ప్రభుత్వం, వారిని నిలువునా మోసగిస్తోందని, విద్యుత్ కోతలతో అటు రైతుల్ని ఇటు పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతోందంటూ జేపీ కిరణ్ సర్కారు వైఖరిని తూర్పార పట్టారు. క్షేత్ర స్థాయిలో రైతుల దుర్గతిని పట్టించుకోకుండా ప్రభుత్వం మన్ను తిన్న పాములా వ్యవహరిస్తే రైతుల బాగోగుల్ని ఎవరు పట్టించుకున్తారని నిగ్గదీశారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగి రైతుల నికరాదయం తగ్గుతోందని, ఆ మేరకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దున్న పోతుపై వాన పడ్డ చందంగానే ఉంది.

Saturday, 18 February 2012

రైతుకు మద్దతు ధరలిచ్చి ఆదుకోండి!

                               
                                                   
రాష్ట్రంలో ధాన్యం రైతుకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలను కూడా మిల్లర్లు అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బోనస్ సైతం అందించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. "అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు" చందంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి మంచి రేటు వచ్చే ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా రైతుల్ని అడ్డుకుంటోంది. రైతులు స్వేచ్చగా ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాల్లోనూ విక్రయించుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సిగ్గుచేటు. దీన్ని నిరసిస్తూ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఈ రోజు ఉదయం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నుంచి కర్ణాటకలోని గిల్కసూగుర్ వరకు "రైతు సత్యాగ్రహ పాదయాత్ర" చేపట్టారు. వ్యవసాయానికి అయ్యే ఖర్చు 40 నుంచి 50 శాతం పెరిగితే ప్రభుత్వాల విధానాల వల్ల రైతుకు లభించే రేటు 30 - 40 శాతానికి పడిపోయిందని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించి కర్ణాటకలో ధాన్యాన్ని విక్రయిస్తామని చేతనైతే దీన్ని అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చట్ట విరుద్ద ఆంక్షల్నిఉల్లంఘించడం వినా రైతులకు మరో మార్గం లేదంటున్న జేపీ, తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు మేలు చేస్తే చాలంటున్నారు. జేపీ నిబంధనల్ని ఉల్లంఘించడం అటుంచి కేంద్రం ఆదేశాల్ని అమలు చేయకుండా రైతుల్ని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి శిక్ష వేయాలి..? ఈ పాలకుల్ని ఇంకా ఎందుకు ఉపేక్షించాలి..? ప్రభుత్వం జేపీ పాదయాత్ర తర్వాతైనా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

Wednesday, 15 February 2012

రాష్ట్రంలో జీరో బడ్జెట్ వ్యవసాయంపై సుభాష్ పాలేకర్ సదస్సులు

                                                             
సహజ వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ దేశంలో ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తోన్న సుభాష్ పాలేకర్ గురించి ఆంధ్ర ప్రదేశ్ రైతులకు సుపరిచితమే. ఆయన అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ఆచరించేందుకు మన రాష్ట్రానికి చెందిన కొందరు పాలేకర్ ను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి రైతులకు రెండేళ్లుగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 18  నుంచి 22 వ తేదీ వరకు తిరుపతిలో జీరో బడ్జెట్ వ్యవసాయం పై  ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతి సదస్సు గురించి 09849059573 ఈ నెంబరులో సంప్రదించవచ్చు.
అలానే ఏప్రిల్ 1  నుంచి 5 వ తేదీ వరకు హైదరాబాద్ లో సైతం ఇటువంటి సదస్సు జరగనుంది. హైదరాబాద్ లకడికపూల్ లో ఉన్న మారుతి గార్డెన్స్ లో జరగనున్న ఈ సమావేశానికి ఆసక్తి ఉన్న రైతులు హాజరు కావచ్చు. పర్యావరణ ఉద్యమకారుడు "సేవ్" సంస్థ నిర్వాహకుడు అయిన విజయరాం హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 040 - 27654336 నెంబరులో సంప్రదించవచ్చు.

Friday, 3 February 2012

ప్రతి బొట్టు నీటికీ లెక్కలు చెప్పాలంట...?

                                                             
భవిష్యత్తులో ప్రతి నీటి బొట్టు వినియోగానికి లెక్కలు చెప్పాలని మంగళవారం విడుదలైన జాతీయ జలవిధానం ముసాయిదా నిర్దేశిస్తోంది. ప్రస్తుతం సేవలు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా సేవలు నియంత్రించే సంస్థలుగా మారాలంటోంది. ఇప్పటికే తక్కువగా ఉన్న జల విద్యుత్ ధరలను పునః సమీక్షించాలంటోంది. నీటి సరఫరాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వ్యత్యాసాన్ని తగ్గించాలన్నది ఈ ముసాయిదాలోని మరో కీలకాంశం. రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి పనిచేస్తున్న పలు   ట్రైబ్యునళ్ళ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఒకే ట్రైబ్యునల్ ఉండాలని ముసాయిదా ప్రతిపాదించింది. ఫెడరల్ విధానాన్ని తుంగలో  తొక్కి దేశం మొత్తం ఒకే జలవిధానం అంటూ సరళీకరణ ఆర్ధిక విధానాలను మరింతగా రాష్ట్రాలపై రుద్డటమే లోగుట్టనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రణాలికా సంఘం ఉచిత విద్యుత్తుపై ఆక్రోశం వెళ్ళగక్కిన నేపధ్యంలో కొత్త జలవిధానం అమలైతే రాష్ట్ర రైతులకు ఉచిత విధ్యుత్ అందే అవకాశం ఉండకపోవచ్చు. అలానే భూగర్భ జలాలకు సెస్సు వసూలు చేయాలని పేర్కొన్న దృష్ట్యా కేంద్రం ఆమ్ ఆద్మీని కాల్చుకుతినే ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోదని స్పష్టమవుతోంది.
                                                                  

అలానే నీటిని ప్రైవేటీకరిస్తే ప్రతి చుక్క నీటిని లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే అవకాశముంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీటి పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. నీటిని అందించలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని గతంలో సుప్రీంకోర్ట్ చేసిన వ్యాఖ్యలతోనైనా పాలకులకు జ్ఞానోదయం కాకపోవడం నేటి విషాదం.  మొత్తానికి నీటిని ఆర్ధిక వస్తువుగా గుర్తించి సమర్ధ వినియోగానికి పెద్ద పీత వేయాలన్నదే ఈ జాతీయ జల విధానం అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.