Monday, 10 September 2012

భారత్ లో మందగించిన వరి పరిశోధనలు

                                                        
మన దేశంలో హైబ్రిడ్ వరి వంగడాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను సోమవారం హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ వరి సదస్సు నొక్కి చెప్పింది. దశాబ్దాలు గడుస్తున్నా మన పరిశోధనలు ముందుకు సాగటం లేదు. ఆహార భద్రత అంటూ గొంతు చించుకుంటున్న కేంద్ర సర్కారు... ఆ దిశగా పరిశోధనలకు పెద్ద పీట వేయడంలో ఘోరంగా విఫలమైంది. మన రాష్ట్రం విషయానికి వస్తే., రెండు దశాభ్దాల క్రితం రూపొందించిన చైతన్య, కృష్ణవేణి, ఐ.ఆర్ రకాలనే రైతులు నేటికీ వాడుతున్నారు. దిగుబడులు పెరగకపోవడం వల్ల రైతుకు నికరాదాయం తగ్గి సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పరిశోధనలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్లనే ఈ దుస్థితి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా ఈ దిశగా దూసుకుపోతుంటే., మనం ఎక్కడో ఉన్నాం. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తోంటే., మన రైతులు సేద్యంలో నిలదొక్కుకునే పరిస్థితులు కూడా కల్పించలేకపోతున్నాం. "శ్రీ" వరి సాగు విధానంతో హెక్టారుకు 224 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డ్ సాధించిన రైతులు మన దేశంలో ఎందరో ఉన్నారు. ప్రభుత్వాలు కనీసం ఇటువంటి విదానాలనైనా ప్రోత్సహిస్తే అన్నదాతకు మేలు జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు ఉంటేనే వ్యవసాయం  మనుగడ సాగిస్తుంది. 

Friday, 31 August 2012

మట్టి వినాయకులకు జై కొడదాం!

                                                         
రాష్ట్రంలో ఏటా వినాయక చవితికి ఉపయోగిస్తున్న విగ్రహాలు 90 నుంచి 93 శాతం ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ తో రూపొందించినవే కావటం గమనార్హం. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని బాగా తగ్గించవచ్చు. గత రెండేళ్లుగా ఈ దిశగా చేపడుతున్న చర్యల వల్ల ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. నగర, పురపాలక సంస్థలు సైతం తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. కొందరు వ్యక్తులు, "సేవ్" వంటి కొన్ని స్వచ్చంద సంస్థలు ఈ దిశగా మట్టి విగ్రహాలను తయారు చేసి చిన్నవి ఉచితంగా, పెద్దవి కొద్దిపాటి ధరలకు అందిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీ పడకుండా రసాయనాలతో కూడిన రంగులు వాడిన రంగు రంగుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఈ ఏడాది మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం.  ఈ ఏడాది హైదరాబాద్ లో దాదాపు 15 వేల మట్టి విగ్రహాలను సరఫరా చేయించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  ఈ దిశగా 100 స్కూళ్లలో చైతన్యం తీసుకొచ్చి విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇంటింటా ఈ వినాయక చవితిని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేద్దాం...  మట్టి వినాయకులకు జై కొడదాం.

Thursday, 23 August 2012

పనికిమాలిన కేంద్రమంత్రి

భారత దేశపు అత్యంత చెత్త వ్యవసాయ మంత్రి శరద్ పవార్ మరోసారి తన అసహనాన్ని వెళ్లగక్కారు. విత్తన                                                 
చట్టంలో తీసుకురావాల్సిన సవరణల గురించి మాట్లాడేందుకు అఖిల పక్షంతో డిల్లీకి వెళ్ళిన కన్నా బృందంపై రుసరుసలాడి తన అసహనాన్ని వెళ్లగక్కారు. మంత్రి కన్నా దీన్ని సరదాగానే తీసుకున్నా వారితో వెళ్ళిన రైతు నాయకులతో నేను మాట్లాడినప్పుడు.., పవార్ తమను ఎందుకొచ్చారు అన్నట్టు చూసారని., కనీసం అతిదులమన్న గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు. విత్తన చట్టంలో బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా ఉన్న పలు అంశాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమైనా., కార్పొరేటే సంస్థలకు బాకా వూదటంలో నేర్పరి అయిన పవార్, దేశీయ రైతుల ఇబ్బందుల గురించి పట్టించుకుంటాడని ఆశించడం అత్యాశే. విత్తన చట్టంలో ఇటువంటి సవరణలు చేస్తే కార్పొరేట్, ఎంఎన్ సీలు నష్టపోతాయని  పవార్ కి బాగా తెలుసు. వీళ్ళు లాభ పడేలా చేయాలనేదే ఆయన ఉద్దేశమని యావత్ దేశానికి తెలిసినా పాపం మన మౌన రుషి మన్మోహన్ సర్కారుకు తెలియదు. భారతీయ రైతుల్ని రక్షించాలంటే స్వతంత్ర భారత చెత్త వ్యవసాయ మంత్రి పవార్ ను క్రికెట్ కు పరిమితం చేయండి మహాప్రభో!   

Monday, 20 August 2012

తెలుగు రైతుకు దక్కుతున్నదేమిటి?

దేశంలో నెలకొన్న కరవు పరిస్థితుల వల్ల ఆహారోత్పత్తి కుంటుపడి తద్వారా ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతకు మించి సేద్యంలో మరిన్ని నష్టాలకు రైతులు సిద్దపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరవు సాయం విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సొంత రాష్ట్రం పట్ల చూపుతున్న మమకారం, దక్షిణాది  రాష్ట్రాల విషయంలో చూపుతున్న సవతి ప్రేమ కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వానికి మునుముందు సమస్యలు తెచ్చిపెట్టనుంది. కరవు కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతుల విషయంలో ఏమీ మాట్లాడని మన ఎంపీలు., సంకీర్ణ ప్రభుత్వంలో కొందరు మిత్రపక్ష మంత్రులు వ్యవహరిస్తున్న తీరును గుడ్లప్పగించి చూస్తుండటం విచారకరం. ఏదేమైనా అంతిమంగా నష్టపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రైతుల పరిస్థితి., కరవు వల్ల, ఆహార భద్రతా సమస్య తదితర అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
                                                         


Monday, 30 July 2012

కమ్ముకుంటున్న కరవు మేఘాలు!

                                                                
దేశంలో సాధారణం కంటే వర్షపాతం లోటు 21 శాతం ఉండటం కరవు పరిస్థితుల్ని సూచిస్తోంది. పది రోజుల క్రితం వరకు రాష్ట్రాన్ని వెంటాడిన కరవు ఛాయలు నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాభావం ఇలానే కొనసాగితే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు  తీవ్ర ఇబ్బందులు వచ్చి పడటం ఖాయం. ఇప్పటికే ఆలస్యంగా నాట్లు వేసుకుంటున్న రాష్ట్ర రైతులు ఈ రెండు నెలల్లో వర్షాలు కురవకపోతే పూర్తిగా నష్టపోవలసి  ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు ఇప్పటికే అమెరికాను కరవుతో కమ్మేశాయి. మన దేశంలో సైతం పెచ్చరిల్లిన కరవు కారణంగా ఆహారోత్పత్తి గణనీయంగా తగ్గే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ముందుకు సాగాల్సిన  అవసరముంది. కరవు వచ్చినప్పుడే  మేల్కొని ఏం చేయాలో ఆలోచించే కంటే., ఒక దీర్ఘకాల ప్రణాళికతో కరవును ఎదుర్కొనే వ్యూహాలను రచించి అమలు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. ఇప్పటికే చితికిన రైతులకు ఈ పరిణామం మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టేదే. వారి బాగుసేతకు సర్కారు పక్కా ప్రణాలికలు రచించాలి.  వర్షం వచ్చినప్పుడే గొడుగుల అవసరం గురించి యోచించే మన ప్రభుత్వాలు., యెంత సమర్ధంగా వ్యవహరించగలవన్నదే ప్రశ్న. 

Friday, 20 July 2012

పదునేక్కని ఖరీఫ్ సాగు

నాట్లు పడాల్సిన సమయంలో నారుమడులు పోసుకోవాల్సిన దుస్థితి. నేలన్నరగా వెంటాడిన వర్షాభావంతో పంటలు సాగు చేయకుండానే తీవ్రంగా నష్టపోయిన రైతులు నేడు కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా ఆశావహ పరిస్థితులు ఏర్పడ్డాయని భావించడంలేదు. ఉరుముతున్న ఎల్ నినో పరిస్థితుల్లో వరి నాట్లు పడే సమయానికి తిరిగి వర్షాభావం తలెత్తితే రైతుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. ఈ పరిణామాలను విశ్లేషిస్తూ., ఇటువంటి సమయాల్లో సర్కారు చర్యలు ఎలా ఉండాలో సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                                

Sunday, 24 June 2012

మొలకెత్తిన విపత్తు!

విత్తన సంక్షోభం రాష్ట్ర రైతుల్ని పట్టి పీడిస్తోంది. ప్రణాళికా లోపం వల్ల విత్తనాల కొరత సీజన్ ముంగిట్లో రైతులకు కలవరం కలిగిస్తోంది. ముఖ్యంగా పత్తి విత్తనాలు దొరక్క రైతులు అల్లాడుతుంటే, నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తడంతో అన్నదాతలు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి సేద్యం భారంగా మారిన రైతులకు సర్కారీ నిర్లక్ష్యం పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ పరిణామాలపై  నేను రాసిన "మొలకెత్తిన విపత్తు!" వ్యాసాన్ని ఈనాడు ఆదివారం ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.