Wednesday 11 January 2012

రైతు మళ్ళీ ఓడిపోయాడు!

                                       
 అవును. మరోసారి ప్రకృతి చేతిలో కోస్తా రైతు చావుదెబ్బ తిన్నాడు. పట్టించుకోని పాలకులు రైతుల్ని పదే పదే దేబ్బతీస్తుంటే., ప్రకృతి సైతం అన్నదాతల సహనాన్ని పరీక్షిస్తోంది. గత కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలంగాని కాలంలో వర్షాలు కురుస్తూ రైతుల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. పంటకు అవసరమైనప్పుడు వర్షాలు కురవటంలేదు. అవసరం లేని సమయాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు అపార పంట నష్టాలకు కారణమవుతున్నాయి. సాధారణంగా నవంబర్ తర్వాత తుపాన్లు రావు. కానీ సీజన్లు గతి తప్పడంతో డిసెంబర్ లోనూ జనవరి లోనూ తుపాన్లు, అల్ప పీడన ద్రొణులూ  ఏర్పడుతూ  పంట పూత, కాత
 దశల్లో తీవ్ర నష్టం కలిగించి రైతుల్ని అప్పులపాల్జేస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతి చేస్తున్న గాయాలైతే., ఆ నష్టాల నుంచి రైతుకు ఉపశమనం కల్గించాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో అన్నదాతకు గుండెకు అంతకు మించిన గాయమవుతోంది. తాజా భారీ వర్షాలతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు ఇతర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ రైతుల్ని కలవరపరుస్తున్నాయి. ఫలితంగా వరి, పొగాకు, మిర్చి, మినుము, పెసర, సెనగ పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేలో కోసిన వరి పనలు వశాలకు తడిసి గింజలు మొలకెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు.
                                                           
ఈ సీజన్లో ఇప్పటికే ఖరీఫ్ పంటలు కోల్పోయి రైతులు అప్పుల పాలయ్యారు. రబీ పంటలు వేయగానే థానే తుపాన్ కొంత ప్రభావం చూపింది. తాజాగా కోస్తాపై నెలకొన్న ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలు రైతుకు కంట నీరు తెప్పిస్తున్నాయి. అకాల వర్షాలతో ఆశలు ఆవిరి చేసుకున్న రైతులు తమ దురదృష్టానికి నేడు చింతిస్తునారు. కాలం కలసి రాక ప్రభుత్వం పట్టించుకోక ఏకాకిగా మిగిలిన రైతులు,  ఈసారి సంక్రాంతి పండుగను కూడా ఉత్సాహంగా  చేసుకోలేని స్థితిలో ఉన్నారు. తమ లక్ష్యాల సాధన కోసం ఉద్యమాలు, సమ్మెలు చేసి ప్రభుత్వాలను అదిలించి కదిలించే వర్రితో పోల్చితే అన్నదాతలెంత అమాయకులు. ఒకవైపు చుట్టుముట్టిన కరవు, మరోచోట భారీ వర్షాలతో పంట నష్టాలు... కరవుపై కార్యాచరణ ప్రకటించని సర్కారు... రాష్ట్రంలో అసలు వ్యవసాయాన్నే పట్టించుకోని పరిస్థితులుంటే అన్నదాతలు ఒంటరిగా మిగలక ఏం చేస్తారు..?

No comments: