బీహార్
కు చెందిన ఐదుగురు రైతులు సాధించిన అపూర్వ విజయమిది. వీరంతా చైనాకు చెందిన
ఒక రైస్ బ్రీడర్ సాధించిన ప్రపంచ రికార్డును తిరగ రాశారు. వరి సాగులో ఈ
రైతులు సాధించిన విజయం వెనుక అక్కడి వ్యవసాయ అధికారుల కృషి ఎంతో ఉంది.
బీహార్లోని నలంద జిల్లా కత్రిసరాయ్ బ్లాక్ లోని దార్వేష్ పురా అనే ఓ
మారుమూల గ్రామం ఈ ప్రపంచ రికార్డ్ కు వేదిక కావడం విశేషం. ఈ గ్రామానికి
చెందిన ఐదుగురు రైతులు " శ్రీ " సాగు పద్ధతిలో (సిస్టం ఆఫ్ రైస్
ఇంటెన్సిఫికేషన్) వరి సాగు చేసి హెక్టారుకు 224 క్వింటాళ్ళ (22 .4
టన్నులు) ధాన్యం దిగుబడిని సాధించారు. ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన యువ
రైతు సుమంత్ కుమార్ ఈ రికార్డ్ ను సాధించిన రైతుగా ప్రపంచ ఖ్యాతిని
అందుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ అనే రైతు 220 క్వింటాళ్ళు., నితీష్ కుమార్ అనే రైతు 196 క్వింటాళ్ళు., రామానంద్ సింగ్ 192 క్వింటాళ్ళు., సంజయ్ కుమార్ 190 క్వింటాళ్ళ
దిగుబడిని సాధించడం అపూర్వం. వీరిలో ఒకరు మాత్రం గతంలో చైనా నెలకొల్పిన
రికార్డును సమం చేయగా మిగిలిన నలుగురూ దాన్ని బ్రేక్ చేశారు. చైనాకు చెందిన
యాన్ లాంగ్ పింగ్ అనే రైస్ బ్రీడర్ 2004 లో DH-2525 అనే వరి వంగడాన్ని వాడి హెక్టారుకు 190 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి రికార్డ్ ను నెలకొల్పాడు. ఇతన్ని చైనాలో " ఫాదర్ అఫ్ హైబ్రిడ్ రైస్ " గా పిలుస్తారు.
బీహార్
రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ అరవింద్ సింగ్., జిల్లా వ్యవసాయాధికారి
సుధామ మహతో తదితరులు సుమంత్ అతని సహచరుల పొలాలకు వెళ్లి స్వయంగా ఈ రికార్డ్
దిగుబడికి నెలవైన పంట పొలాలను పరిశీలించి వచ్చారు. నలంద జిల్లాలో 2008 లో మొదలైన " శ్రీ " సాగు విధానం వల్ల దాదాపు 25 వేల మంది రైతులు నేడు ఈ పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. తమ రైతులు సాధించిన ఈ విజయాలతో పొంగిపోయిన బీహార్ డైనమిక్ ముఖ్యమంత్రి
నితీష్ కుమార్ దేశంలో రెండో హరిత విప్లవం బీహార్ నుంచే ప్రారంభమవుతుందని
చెబుతున్నారు.
నిజానికి బీహార్ లో "శ్రీ " వరి సాగులో ఇంత విప్లవం రావడం వెనుక మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించిన సహకారం కొంత ఉంది. 2003 లో ఒక రకంగా దేశంలో తొలిసారిగా మన రాష్ట్రం "శ్రీ " వరి సాగుకు శ్రీకారం చుట్టింది. 1983
లో మడగాస్కర్లో ప్రపంచంలో తొలిసారి "శ్రీ " సాగు పద్దతి మొదలయ్యాక నేడు
విశ్వ వ్యాప్తమైంది. మన రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఈ
పద్ధతిని పాటించాక దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన నుంచి స్పూర్తిని పొందాయనే
చెప్పాలి. అప్పట్లో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా ఉన్న డాక్టర్
ఆలపాటి సత్యనారాయణ అప్పటికే శ్రీలంక లో సాగులో ఉన్న "శ్రీ" సాగు
విధానాన్ని పరిశీలించి వచ్చి మన రాష్ట్రంలో ఈ పద్దతిని ప్రోత్సహించారు.
వారి కృషి వల్ల " శ్రీ" సాగు అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలిచింది. 2004 లో రాష్ట్రానికి చెందిన గుడివాడ నాగరత్నం నాయుడు అనే రైతు హెక్టారుకు సుమారు 17 . 25 క్వింటాళ్ళ దిగుబడిని సాధించి జాతీయ స్థాయిలో ఆదర్శ రైతుగా నిలిచారు.
అదే
కాలంలో బీహార్ రాజధాని పాట్నా లో ఉన్న Directorate of rice Developement
డైరెక్టర్ గా ఉన్న దివాకర్ మన విశ్వవిద్యాలయానికి వచ్చి " శ్రీ " సాగులో
శిక్షణ పొంది, మెలకువలు తెలుసుకుని తన రాష్ట్రంలో ఈ పధ్ధతి వ్యాప్తికి ఎంతో
కృషి చేశారు. దీని ఫలితంగా నేడు బీహార్లోని ఒక్క నలందా జిల్లాలోనే 90 శాతం
మంది రైతులు "శ్రీ " పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. 2005 లో
సత్యనారాయణ గారు పదవీ విరమణ చేశాక " శ్రీ " సాగు వ్యాప్తి గురించి
విశ్వవిద్యాలయంలో ఆశించిన మేరకు కృషి జరగలేదు. వ్యవసాయ శాఖతో సహా ఎవరూ
పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా మన రాష్ట్రంలో ఈ పద్దతిని పరిశీలించిన
బీహార్, బంగ్లాదేశ్, అస్సాం, బెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు "
శ్రీ " సాగుతో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తే.,
మన రైతులు మాత్రం ఆరేళ్ళు గడిచినా "శ్రీ" వ్యాప్తికి ముందుకు సాగలేక
పోయారు. సత్యనారాయణ గారు అందించిన సహకారంతో పాటు స్వయం కృషితోనే నాగరత్నం
నాయుడు వరి సాగులో అధిక దిగుబడులు సాధించగలిగారు. నేడు ఆయన ఒక్కరే "శ్రీ "
పద్దతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా తోటి రైతులకు
సేవలందిస్తున్నారు.
సుమంత్ అనే యువ రైతు సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుందాం.
No comments:
Post a Comment