Tuesday 31 December 2013
Wednesday 25 December 2013
వ్యవసాయం గాలిలో దీపం!
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఈ ఏడాది పాలకులకు ప్రజా సమస్యలు పట్టకుండా పోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం తీవ్రంగా ప్రభావితమైంది. రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గడచిన ఐదేళ్ళలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే మంచి పంటను దక్కించుకున్న రైతులు వరుస నష్టాలతో అప్పులు పెంచేసుకున్నారు. ఈ ఏడాది సేద్య రంగం స్థితిగతులపై నేను రాసిన సమీక్షను ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Tuesday 10 December 2013
బాలి లో ధనిక దేశాలకు తాత్కాలికంగా చెక్!
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లు టి వో ) 9వ మంత్రిత్వ స్థాయి సమావేశాలు ఇండోనేసియా లోని బాలి లో ఈ నెల 6న ముగిశాయి. వ్యవసాయ సబ్సిడీలను మొత్తం ఆహార ఉత్పత్తుల్లో 10 శాతానికి తగ్గించాలన్న సంపన్న దేశాలు తాము 40 శాతానికి పైగా సబ్సిడీలు అందిస్తూ సుద్దులు చెబుతున్నాయి. ఈ నిబందనలు అమల్లోకి వస్తే తమ దేశంలో అమలు జరుగుతున్న ఆహార భద్రత పధకానికి ముప్పు వాటిల్లుతుందని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ వాదనను అంగీకరించక తప్పని పరిస్థితుల్లో ధనిక దేశాలు దిగి వచ్చాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా ముఖ్యంగా పేద దేశాలకు విజయంగా చెప్పవచ్చు. ఈ అంశాలపై డబ్లు టీ వో చర్చలు ముగిసిన రోజు రాత్రి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Friday 8 November 2013
Saturday 2 November 2013
Wednesday 30 October 2013
పంట చేలల్లో కన్నీటి మంటలు
విపత్తులు ఉరుముతున్నప్పుడల్లా రాష్ట్ర రైతులు చిగురుటాకులా కంపించిపోతున్నాడు. ఏటా ఉత్పాతాలు విరుచుకుపడిన ప్రతిసారీ పంటలు ధ్వంసమై రైతులు చితికిపోతుండటం పరిపాటిగా మారుతోంది. గడచిన పదేళ్ళలో నాలుగు పంటలే దక్కాయి. నష్టం జరిగిన ప్రతిసారీ పాలకులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చిటికిన బతుకులకు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టడం లేదు. విపత్తుల విషయంలో ప్రకృతి కంటే ప్రభుత్వమే రైతుల్ని ఎక్కువగా గాయపరుస్తోందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
Sunday 8 September 2013
శరణం శ్రీ గణేశం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!
సర్వేజనా సుఖినోభవంతు.
Friday 6 September 2013
రైతు శ్రేయం తోనే ఆహార భద్రత!
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కేంద్రం గొప్ప ముందడుగు వేయడం సంతోషించదగిన విషయమే. కానీ ఆహార భద్రత కల్పించే క్రమంలో నిర్లక్ష్యం చేయకూడని అంశాలను కేంద్రం ఉపెక్షిస్తుండటమే విచారకరం. దేశంలో తిండి గింజలు పండించే రైతులే ఒక పూట తిండికి నోచుకోలేక పోతున్నారు. వారి సంక్షేమం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా., రెట్టింపు దిగుబడులు సాధించాలంటే రైతుకు ఏ విధంగా చేయూత నివ్వాలనే అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఆహార భద్రత సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతుకు భద్రత కల్పిస్తేనే ఆహార భద్రత సుసాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Friday 5 July 2013
రైతుకు తోడ్పాటేదీ..!
ఏటా వ్యవసాయ కార్యాచరణ కాగితాల్లోనే కనిపిస్తోంది తప్ప పంట దిగుబడుల్ని పెంచేందుకు, రైతుల్ని ప్రోత్సహించేందుకు సర్కారు చిత్తశుద్దిని చూపటం లేదు.
ఏటికేడూ లక్ష్యాలు ఘనంగానే కనిపిస్తున్న వాటిని సాకారం చేసుకునేందుకు
చేస్తున్న కృషి బొత్తిగా శూన్యం. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు,
రుణాలు, సాగునీరు వంటి పంట ఉత్పాదకాలు అందటం ఎంత ముఖ్యమో సాంకేతికతను
ఉపయోగించి మెరుగైన దిగుబడులు సాదించేలా రైతులకు సాగు విధానాల్లో సలహాలు
అందించడం అంటే ప్రధానం. ఇవన్నీ విస్మరిస్తున్న కారణంగా అధికోత్పత్తులు
సాధించడంలో ఆశించిన పురోగతి సాధ్య పడటం లేదు. ఇప్పటికైనా సాగు చేస్తున్న
రైతులు వివిధ స్థాయిల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలు
చూపగలిగితే మన రైతులు అధ్బుత దిగుబడులు సాధించడంలో ప్రపంచంలో ఎవరికీ
తీసిపోరనటంలో సందేహం లేదు. ఎటొచ్చీ సర్కారు చిత్తశుద్ది పైనే
సందేహమంతా...!
Sunday 30 June 2013
"శివగీతార్చన" ఆడియో సీడీ విడుదల
నా ఆరాధ్య దైవం షిర్డీ సాయి పై "సాయి స్వరార్చన" పాటల సీడీని విడుదల చేశాక
రెండేళ్లకు ఆదిశంకరునిపై పాటలు రాసే మహద్భాగ్యం లభించింది. గతేడాది
శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సీడీలో శ్రీగిరిలో వెలిసిన
మల్లన్న పై ఒక పాట తప్పనిసరిగా ఉండాలనుకున్నాను. ఆ శంకరుని అనుగ్రహంతో,
మిత్రుడు వెంకటేశ్వరరావు అందించిన సహకారంతో మహాశివుని పై ఆరు పాటలు రాసిన
"శివగీతార్చన" సీడీని నిన్న శనివారం శ్రీశైలంలో శంకరునికి సమర్పించడం
జరిగింది. శివునికి రుద్రాభిషేకం చేయించి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు
వచ్చే సరికి ఆలయం మైకు నుంచి వినిపిస్తున్న నా పాటలు ఎంతో సంతృప్తిని
మిగిల్చాయి.
Friday 14 June 2013
కడగండ్ల ఏరువాక
సకాలంలో వర్షాలు కురిసినా విత్తనాలు దొరక్క రైతులు నానా అగచాట్లు
పడుతున్నారు . సర్వం సిద్ధం చేశామంటున్నవ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో రైతులు
ఏటా ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపలేక పోతోంది. సీజన్
ముంగిట రైతుకు విత్తన సమస్యలు మామూలు అవుతున్నా సర్కారులో సర్కారులో చలనం
లేదు. పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలోనూ రైతుకు పంట ఉత్పాదకాలను
సకాలంలో అందించడం ద్వారా వారికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించటం లేదు.
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసి
చెప్పినా రైతులు దుక్కులు దున్నే నాటికి విత్తనాలు సిద్దం చేయాల్సిన
సర్కారు యెంత సన్నద్ధంగా ఉందో., నేడు రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు
పడుతున్న పాట్లను చూస్తే తెలుస్తుంది. రైతు శ్రేయం విషయంలో ఎప్పుడూ మొద్దు
నిద్ర పోయే ప్రభుత్వాలకు అన్నదాతల కష్టాలు కనిపిస్తున్నాయా...?
Saturday 11 May 2013
కార్పొరేట్ సేద్యం - సర్కారు చోద్యం!
సదుపాయాలు కల్పించకుండా చిన్న రైతులు సేద్యంలో లాభాపడలేక పోతున్నారంటూ కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతుకు ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా కార్పొరేట్ సంస్థలతో వ్యవసాయ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని స్వాగతించాలా వద్దా అనే సంగతిని పక్కన పెడితే రైతుకు రక్షణ కల్పించే ఆంశాలను ఈ ఒప్పందాల్లో ఎందుకు పొందు పరచలేదన్నదే ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ వ్యవసాయ విధానంలో రైతు ప్రయోజనాలను విస్మరించిన ఆంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు "ఈనాడు" ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Thursday 25 April 2013
కళ్ళు తెరవాల్సింది పాలకులే..!
ప్రభుత్వం మీ కోసం లక్ష లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేసింది., ఈసారి పనిముట్లకు ఇటువంటి రాయితీలు ఇస్తాం, ఎరువులు కొరత లేకుండా చూస్తాం., విత్తనాలకు కొరత రానీయకుండా చూస్తాం....... రైతు చైతన్య యాత్రల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పెంచుతున్న అవగాహన ఇది. వాస్తవానికి రైతులకు అవగాహన పెంచాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న సేధ్యరంగాన్ని గట్టెక్కించాలంటే రైతులకు మార్కెట్ తెలివిడిని పెంచే చర్యలు చేపట్టాలి. ఈ ఏడాది ఏయే పంటలకు గిరాకీ ఉంది.? ఏయే పంటలను ఎంతెంత విస్తీర్ణంలో సాగు చెయాలి...? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఏ సమయంలో పంటను మార్కెట్ కు తీసుకువెళితే రైతుకు మంచి ధర వస్తుంది ...? ఒకవేళ ధర లేకపోతే ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది... ? మంచి ధరలు ఎలానూ ఇవ్వలేని ప్రభుత్వం చైతన్య యాత్రల్లో రైతుకు నేర్పాల్సినవి ఇవే...! ఇవన్నీ వదిలిపెట్టి రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని యాత్రల పేరిట ఈ జాతరకు ఖర్చు చేస్తుండటం సిగ్గుచేటు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Sunday 21 April 2013
Thursday 18 April 2013
శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు సదా పూజ్యనీయుడు. అత్యున్నత వ్యక్తిత్వంలోని స్పూర్తిమత్వాన్ని మనం రాముడులోనే చూస్తాం. ధర్మవర్తనుడుగా నిలవటమే కాకుండా విశిష్ట లక్షణాలతో సకల సద్గుణాల కలబోసిన వ్యక్తి కనుకే రాముడు జగదబిరాముడు అయ్యాడు. ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజనానికి మార్గదర్శకుడుగా నిలిచాడు. అటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవడమే మానవాళికి నిజమైన వికాసం. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Thursday 11 April 2013
శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు జరుపుకునే పండుగే యుగాది ఉగాది. తొలి సంవత్సరాదిగా తెలుగు ప్రజలు వ్యవహరించే ఈ పండుగ రోజు ఉదయాన్నే పూజ చేసి షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడిని సేవించడం మన సంప్రదాయం. వసంత నవరాత్రులు ఆరంభమయ్యే ఈ శుభదినం నుంచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సకల జనావళికి శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Wednesday 27 March 2013
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యం!
స్థాయీసంఘాల ఏర్పాటుతో బడ్జెట్లో పారదర్సకత, జవాబుదారీతనం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బడ్జెట్ పద్దులు 40 ఉండగా, వాటిలో కీలకమైన 37 శాఖలను 12 స్థాయీ సంఘాల పరిధిలోకి తెఛారు. ఒక్కో సంఘంలో ఉభయ సభలకు చెందిన 31 మంది సభ్యులు ఉంటారు. సభ్యులతో పాటు నిపుణులు, మేధావుల విశ్లేషణలతో స్థాయీ సంఘాల నివేదికలు ఉన్తాయి. ఇంటువంటి సంఘాల ద్వారా ప్రతి సభ్యునికి విధి నిర్వహణపరమైన సంతృప్తి లభిస్తుంది.
అంకెల గారడీగా ఉండే బడ్జెట్లో లోతైన విశ్లేషణ చేయడానికి స్థాయీ సంఘాలు ఉపయోగపడతాయి. అయితే స్తాయీసంఘాలు సమర్ధంగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు చేకూరతాయి. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. శాసనసభకు సమర్పించే నివేదికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన ఏమీ లెదు. అయితే, ఆ వంకతో తానూ పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వీటి వల్ల ఫలితం గుండుసున్నా!
Thursday 7 March 2013
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మహిళలకు సంఘీభావం ప్రకటించే రోజే .... అంతర్జాతీయ మహిళా దినోత్సవం. విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం... ఒకటేమిటి అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా ఒకింత ఎక్కువగానూ నిలిచి గెలుస్తున్నారు మహిళలు. ఆయా రంగాల్లో కష్టాలను ఎదుర్కొంటూనే విజయ బావుటా ఎగుర వేస్తున్నారు. మహిళలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా వారిపై వివక్ష, దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని డిల్లీలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘ్హాతుకమ్... దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై కొత్త భయాలను అనుమానాలను రెకెత్తించిన్ది. అసలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని రంగాల్లో నేలకొన్నప్పుడే స్త్రీ, పురుష సమానత్వం సాధ్యమవుతుంది. ఇది అత్యంత త్వరితంగానే సాకారం కావాలని కోరుకుంటూ యావత్ నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Thursday 28 February 2013
ఎవరినీ మెప్పించని చిదంబరం బడ్జెట్
భారీ అంకెల తిరగమోతగానే యూపీఏ-2 చివరి సంపూర్ణ బడ్జెట్ ను చిదంబరం మహా ఘనంగానే వండి వార్చారు. పన్నుల సంస్కరణల నిర్వహణకు ప్రత్యేక కమిషన్ ను ప్రకటించిన చిదంబరం .. జన సామాన్యం పై వడ్డన భారం పొంచే ఉందని పరోక్షంగా చెప్పారు. గత ఏడాది ఏడాది కంటే 22 శాతం పెంచి వ్యవసాయరంగానికి 27 వేల 49 కోట్లు కేటాయించారు. అలానే ఏడు లక్షల కోట్ల రైతు రుణాల లక్ష్యంలో మంజూరయ్యేది ఎంతన్నదే అసలు ప్రశ్న! రైతుల భధ్రతకు భరోసా ఇవ్వకుండా ఆహార భధ్రత కు సైతం పెద్దగా కేటాయింపులు లేకుండా చిదంబరం బడ్జెట్ చాలా చప్పగా ఉంది. ఒక్క వాఖ్యంలో చెప్పాలంటే ..... అటు ఎన్నికల ఊసులు ఎక్కువగా లేకుండా ఇటు సంక్షేమం ఆశలు వెల్లివిరియకుండా ఎవరినీ పెద్దగా సంతృప్తి పరచకుండానే సాగిన బడ్జెట్ ఇది.
Monday 25 February 2013
కేంద్ర బడ్జెట్లో వ్యవ'సాయం' పెరగాలి
ఏళ్ళు గడుస్తున్నా రైతుల పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆహారభద్రత గురించి
గొంతు చించుకుంటున్న యూపీఏ ప్రభుత్వం దీనికి మూలమైన వ్యవసాయ రంగ
అభివృద్ధిని విస్మరిస్తోంది. సాగులో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగాలంటే
రైతుకు చేయూత అవసరం. అందుకు తగిన సాంకేతికతను అందుబాటులో ఉంచాలి. ఇవేమీ
చేయకుండానే వ్యవసాయం బాగున్నట్టు ఆహార భద్రత కల్పించేస్తామంటూ కేంద్రం
ప్రజల్ని మభ్య పెడుతోంది. దశాభ్దాలుగా సేద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతుల పరిస్థితి దిగజారింది. ముందు రైతుల్ని నిలబెట్టే చర్యలకు ఉపక్రమించకుండా బడ్జెట్లలో
కేంద్రం వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపుతూ వచ్చింది. 28న కేంద్రం ప్రవేశ
పెట్టనున్న సాధారణ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండాలి ? రైతుల పరిస్థితి
మెరుగు పడాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Tuesday 12 February 2013
రైతుల కోసం ప్రభుత్వాలు మారవా ?
వ్యవసాయంలో దేశం ఎంతో పురోగమించింది అన్నది తిరుగులేని వాస్తవం. మరి మన
రైతులెందుకు చితికిపోతున్నారు..? అన్ని వర్గాల ప్రజలు జీవితంలో ఎంతో కొంత
ప్రగతి సాధిస్తే., రైతుల పరిస్థితే ఎందుకని దిగజారుతోంది.. ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక పోతున్నాయి. రైతు శ్రేయం కాపాడే విషయంలో చేతకానివిగా మిగిలిపోతున్నాయి.
రైతుకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ప్రభుత్వాలకు తెలిసినా అవి అందించే విషయంలో
ఆడ్డుపడుతున్న శక్తులను నియంత్రించలేని తీరు వల్ల అన్నదాతలు సేద్యంలో
చితికిపోతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ
వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే.., హెక్టారు సగటు ఉత్పాదకతలో
ఆశించిన పురోగతి లేక రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. కాయకష్టం చేసి సిరులు
పండిస్తున్నా రైతుల పరిస్థితి దయనీయంగా ఉండటానికి దారితీస్తున్న కారణాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Sunday 13 January 2013
పొలంలో పండాలి క్రాంతి
సంక్రాంతి రైతుల పండగ. ధాన్యపు రాశులు ఇంటికి చేరే సమయం కాబట్టే ఇది రైతుల పండగయ్యింది. సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో, రైతుల ముంగిళ్ళలో కనిపించే ఆ శోభ అనిర్వచనీయం. దురదృష్టవశాత్తూ రైతుల కళ్ళల్లో పండగ నాటి ఆనందం నేడు కనిపించడం లేదు. చేతి నిండా నాలుగు డబ్బులుండే పరిస్థితుల నుండి మన రైతులు పంట ఇంటికి చేరకుండానే కల్లంలోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాల చేయూత లేక చితికిన రైతుల్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అన్నదాతలు సంక్రాంతి ఆనందాలకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులను విశ్లేసిస్తూ నేను రాసిన వ్యాసాన్ని నేటి సంక్రాంతి రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేశాను.
సంక్రాంతి శుభాకాంక్షలు
బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పల్లె ఆకు పచ్చని చీర కట్టుకుని పరవశించే పండగ వేళ సొంతూర్లో ఉంటె ఆ ఆనందమే వేరు. మాది గుంటూరు జిల్లా వేమూరు. కోనసీమ పల్లె అందాలను పుణికి పుచ్చుకున్నట్టు ఎటు చూసినా పచ్చదనంతో, కొబ్బరిచెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది మా వూరు. గతేడాది వెళ్ళలేకపోయినా ఈసారి సంక్రాంతికి వూళ్ళో ఉండాలని గట్టిగా తీర్మానించుకుని వచ్చేశాను. వీలు చిక్కినప్పుడల్లా వూరుకు చెక్కేయడం చెప్పలేని ఆనందం. ఎవరికైనా సొంతూరి గాలి, నీరు, నేల... అసలక్కడి గాలి ఒక్కసారి పీల్చితే చాలు కొన్నాళ్ళకు సరిపడా శక్తిని సమకూర్చుకోవచ్చు. ఇలా చెబుతుంటే గుర్తొచ్చింది... మిత్రుడు గజల్ శ్రీనివాస్ సంక్రాంతి రోజు ఉదయం 9.30 గంటలకు ఈటీవీ-2 లో ఓ మంచి పాట పాడారు. ఒక్కసారి పల్లెకు వెళ్లి రావాలని చెబుతూ ఆలపించిన ఈ గీతం మిమ్మల్ని మీ వూరు తీసుకువెళుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఎంచక్కా పండగ సంబరాలను ఆస్వాదించాలని కోరుకుంటూ మరోసారి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)